జహీరాబాద్ టౌన్: జీరాంజీ (ఉపాధి హామీ పథకం) పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లికపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతన బకాయిలు విడుదల చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసనలు, పెన్ డౌన్, షట్ డౌన్ ఆందోళనలు చేపట్టారు. జీరాంజీ పథకంలో పనిచేస్తోన్న ఏపీఓ, ఈసీ, జేఈ,టీఏలు,కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బంది కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,700 వరకు ఉన్నారు. జిల్లాలో సుమారు 150మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు.
జిల్లాలోని జీరాంజీ ఉద్యోగులు డిమాండ్ పరిష్కారం కోసం జేఏసీ పిలుపు మేరకు పెన్డౌన్ ప్రకటించి ప్రతీ రోజు నిరసనలు తెలుపుతున్నారు. జూలై 27 నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు ప్రతీ రోజు ఓ విధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో న్యాయమైన హక్కుల కోసం నోటీసు ఇచ్చి 16 నుంచి సమ్మెకు వెళ్తామని జేఏసీ నాయకులు చెప్పారు.
ప్రధాన డిమాండ్లు
● 3 నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి
● ఉద్యోగులకు పే–స్కేల్ అమలు చేయాలి
● క్యాడర్ను ఖరారు చేసి, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి
● ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల అవకాశం ఇవ్వాలి
● ప్రతీ నెల మొదటి తేది వేతనాలు చెల్లించాలి
● సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలి.
ఉద్యోగులు పెన్ డౌన్, షట్ డౌన్
వేతనాల చెల్లింపులో జాప్యం
మూడు నెలల నుంచి నిరీక్షణ
ఆందోళనకు దిగిన ఉద్యోగులు


