● ‘పరాభవ’కు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలు
● ఆలయాల్లో పూజలు.. పంచాంగ శ్రవణం
మెదక్ కలెక్టరేట్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఊరూవాడ పరాభవ నామ సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటా నూతన మట్టికుండల్లో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి పిల్లలు, పెద్దలు పంచుకున్నారు. భక్షాలు తయారు చేసి కుటుంబ సభ్యులంతా ఆరగించారు. సాయంత్రం అన్ని గ్రామాల కూడళ్లు, దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయం, రామాలయంలో పూజారి వైద్య శ్రీనివాసశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ నూతన సంవత్సరంలో అకాల వర్షాలతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయన్నారు. అంతకుముందు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉగాది పండుగ వేళ మెదక్ కూరగాయల మార్కెట్ జనంతో కిటకిటలాడింది. మట్టి కుండలు, వేప పువ్వు, మామిడి కాయలు, ఆకులు విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి.


