కథ చెప్పి.. స్ఫూర్తి నింపి
కౌడిపల్లి(నర్సాపూర్): అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువులో వెనుకబడిన విద్యార్థి, అమెరికాలో కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎదిగిన తీరును కథగా చెప్పి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు డీఈఓ విజయ. సోమవారం కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం పదో తరగతిలో విద్యార్థులతో మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు కుంగిపోవద్దని, ఇష్టంతో శ్రద్ధగా చదివితే సాధించలేనిది ఏది లేదన్నారు. తాను మెదక్ ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు డీఈఓగా వచ్చానని, మీరు సైతం ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. జిల్లాలో 220 పాఠశాలల్లో 11,247 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని, వీరి కోసం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాయిలాపూర్ ఉన్నత, కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు.
విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన డీఈఓ విజయ


