సర్కారు బడి.. సరికొత్త ఒరవడి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడి.. సరికొత్త ఒరవడి

Apr 28 2025 7:25 AM | Updated on Apr 28 2025 7:25 AM

సర్కా

సర్కారు బడి.. సరికొత్త ఒరవడి

విద్యార్థుల సంఖ్యను

పెంచేందుకు చర్యలు

మే నెలంతా

ప్రభుత్వ టీచర్లకు శిక్షణ

ఆ తరువాతే బడిబాట షెడ్యూల్‌

గతేడాది కంటే

ఈసారి లక్ష్యం ఎక్కువ

మెదక్‌ జోన్‌: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మీ పిల్లలను ప్రైవేట్‌కు పంపించకుండా సర్కారు బడుల్లోనే చదివించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. ప్రచారంలో ఆలస్యమైతే ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు విద్యార్థులను తీసుకెళ్లి ఎక్కడ చేర్చుకుంటారోనని తొందర పడుతున్నారు. ఇప్పటికే రామాయంపేట మండలం డి ధర్మారంలో, నార్సింగ్‌ మండలం శేరిపల్లిలో ముందస్తుగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మొత్తం 1,006 ఉండగా వాటిలో 1.22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాటిలో 628 ప్రాథమిక పాఠశాలలు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు, 146 ఉన్నత పాఠశాలలు కాగా 27 గురుకులాలు, 19 కేజీబీవీలు, 7 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్‌ బడుల్లో మొత్తం 95 వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రైవేట్‌ పాఠశాలలు 101 ఉన్నాయి. వాటిలో 27 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా వేసవి సెలవులు రాగానే ప్రతి ఏటా ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు కరపత్రాలు ముద్రించి వారి సిబ్బందిని గ్రామాల్లో తిప్పుతూ మా స్కూలుకే పిల్లలను పంపించాలని ప్రచారం చేసేవారు. కానీ ఈసారి ప్రైవేట్‌ స్కూళ్ల ప్రచారం కన్న ముందే ప్రభుత్వం అప్రమత్తమైంది. సర్కారు బడుల్లోనే చేర్పించాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కలెక్టర్‌ ప్రచారం

గత సంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ ప్రత్యేక చొరవ చూపారు. బడిబాటపై ఆయన ప్రత్యేకంగా పాట కూడా రాశారు. అప్పట్లో ఆ పాట సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రోల్‌ అయింది. అంతే కాకుండా నర్సాపూర్‌ మండలంలోని మారుమూల గ్రామంలో రాత్రి అక్కడే బస చేసి, ఉదయం ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందిస్తారని చెప్పారు. ఉచితంగా బుక్స్‌, యూనిఫాంలు ఇస్తారని, ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. దీంతో గత సంవత్సరం 6,200 మంది విద్యార్థులు బడిలో చేరారు.

శిక్షణ తరువాతే బడిబాట షెడ్యూల్‌

మే నెలలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం బడిబాట షెడ్యూల్‌ వస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన ఏ విధంగా అందించాలి? ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్లంలో బోధన కొనసాగాలని ఈ శిక్షణలో ప్రధాన అంశంగా పేర్కొన్నారు. మే మొదటి వారంలో రాష్ట్ర స్థాయిలో, రెండో వారంలో జిల్లా స్థాయి, మూడో వారంలో మండల స్థాయిలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు విధిగా పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

గతేడాది కంటే ఎక్కువ

గత సంవత్సరం బడిబాటలో భాగంగా 6,200 మంది విద్యార్థులను బడిలో చేర్పించాం. ఈ ఏడాది అంతకన్న ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని టార్గెట్‌ పెట్టుకున్నాం. ముందస్తుగానే బుక్స్‌, యూనిఫాంలు అందిస్తాం. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతుంది. సర్కారు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు అన్నిరకాల అర్హతలున్నాయనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి.

– రాధాకిషన్‌, డీఈఓ, మెదక్‌

సర్కారు బడి.. సరికొత్త ఒరవడి1
1/1

సర్కారు బడి.. సరికొత్త ఒరవడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement