
అర్హత సాధిద్దాం.. కొలువు కొడదాం
● పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువత
● టెట్ దరఖాస్తుకు ఈనెల 30 తుది గడువు
మెదక్జోన్: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ దిశగా సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 30వ తే దీ వరకు దరఖాస్తుకు చివరి అవకాశం ఉండగా.. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి అభ్యర్థుల తాకిడి పెరిగింది. జిల్లావ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో ఉన్నత పాఠశాలలు 146, ప్రాథమికోన్నత 127, ప్రాథమిక పాఠశాలలు 628 ఉన్నాయి. వీటిలో 95 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 4,044 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, 3,563 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 481 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జీఓ 317లో సుమారు 800 పైచిలుకు స్థానికేతర ఉపాధ్యాయులు ఉన్నారు. స్థానికతను అమలు చేస్తే వారంతా సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మరో 800 పోస్టులు ఖాళీ అవుతాయి. అదే జరిగితే జిల్లాలో మొత్తం 1,281 టీచర్ పోస్టులు ఖాళీలుగా ఏర్పడే అవకాశం ఉంది. కాగా వీటి భర్తీ కోసం యువత టెట్లో అర్హత సాధించి డీఎస్సీలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
అందుబాటులో డిజిటల్ లైబ్రరీ
డిజిటల్ లైబ్రరీని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని ఆ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డితో కలిసి ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లైబ్రరీ జ్ఞానాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన పది కంప్యూటర్లను లైబ్రరీలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.