
రైతులు సహకరించాలి
చిలప్చెడ్(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు నిర్వాహకులకు పూర్తి సహకారం అందించాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల నాబార్డ్ డీడీఎం కృష్ణతేజ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గౌతాపూర్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. దళారుల నుంచి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నాబార్డ్ డీడీఎం నిఖిల్రెడ్డి, ఎంపీడీఓ ఆనంద్, ఏఈఓ దివ్యశ్రీ, పంచాయతీ కార్యదర్శి శ్రావణి సింధూజ, రైతు ఉత్పత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు యాసిన్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాచీన ఆలయాల
జీర్ణోద్ధరణ అభినందనీయం
పెద్దశంకరంపేట(మెదక్): వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయమని తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి, తొగిట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిలు అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో శ్రీ సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠ, హనుమాన్, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. భావితరాలకు ఆలయ విశిష్టతను తెలియజేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, విజయ్పాల్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభించండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి
పాపన్నపేట(మెదక్): జిల్లాలో 80 శాతం వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి ఎంత మేర వరి కోతలు జరిగాయి, అందుకు సంబంధించి కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, హమాలీలు, లారీల కొరత లేకుండా చూడాలని కోరారు.
పనులు త్వరగా
పూర్తి చేయాలి
రేగోడ్(మెదక్): గ్రంథాలయ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అ న్నారు. రేగోడ్లో నిర్మాణ పనులను బుధ వారం పరిశీలించి మాట్లాడా రు. భవనాన్ని త్వరగా పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
సమ్మెను జయప్రదం
చేయండి: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: మేడేతో పాటు మే 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 139 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన సమరశీల పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులు సహకరించాలి

రైతులు సహకరించాలి