
జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు
రామాయంపేట(మెదక్): అక్రమార్కుల ధన దాహానికి గుట్టలు కరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ రుసుముకు గండి పడుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిని అనుకొని ఉన్న 1421 సర్వే నంబర్లో 764 ఎకరాల మేర ప్రభుత్వ భూములున్నాయి. పట్టణానికి దూరంగా ఉండటంతో పాటు ఆప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెలుతుండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఈ సర్వే నంబర్లో గుట్ట పైభాగంలో జేసీబీ తవ్వకాలతో పెద్దఎత్తున ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గతంలో కలెక్టర్ రాహుల్రాజ్ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గాను స్థలం ఎంపిక కోసం వచ్చిన క్రమంలో ఈ గుంతలను పరిశీలించారు. కాగా జిల్లా పరిధిలో మట్టి తవ్వకాల విషయమై ఆయా మండలాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తుండగా, రామాయంపేటలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై తహసీల్దార్ రజనికుమారి వివరణ కోరగా.. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా మట్టి తవ్వితే సదరు వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు.