
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు
నియోజకవర్గం అభ్యర్థులు
సంగారెడ్డి 30
జహీరాబాద్ 28
పటాన్చెరు 25
ఆందోల్ 21
నారాయణఖేడ్ 20
నారాయణఖేడ్: సార్వత్రిక ఎన్నికల తరుణంలో నామినేషన్ల పర్వం, పరిశీలన (స్కూృట్నీ) సైతం పూర్తయింది. ఇక తుది జాబితాలో ఎవరెవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. టికెట్లు దక్కక కొందరు నామినేషన్ వేయగా, ఇతరత్రా కారణాలతోనూ ప్రధాన పార్టీల నాయకులు పోటీగా మరొకొందరు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్డ్రాకు 15వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇక పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ 20మందికి పైగానే నామినేషన్లు వేశారు. 17 మందికంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే మరో బ్యాలెట్ యూనిట్ పెట్టాల్సి వస్తుంది. ఇలా రెండు బ్యాలెడ్ యూనిట్లు ఉంటే ఓటర్లు తికమక పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఎక్కడ తమకు నష్టం వాటిల్లుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. నామినేషన్లు వేసిన స్వతంత్రులకు ఓట్లు పడితే తమ విజయంపై ప్రభావం చూపుతుందని భావించి వారిని పోటీ నుంచి తప్పుకొమ్మని కోరుతున్నారు. దీంతోపాటు తమ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వారెవరైనా వారి వెనుకున్నారా అని ఆరా తీస్తూ అటు అభ్యర్థులను, ఇటు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరీ పోటీ కన్పిస్తుండటంతో స్వతంత్రులతోపాటు చిన్న పార్టీల తరఫున బరిలో ఉన్న వారిలో సత్తా ఉన్నవారు నామినేషన్ ఉపసంహరింపజేసేలా ఎక్కడికక్కడే రహస్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరిని నయాన్నో, భయాన్నో విత్డ్రా చేయించాలని, లేదా మచ్చిక చేసుకొని విత్డ్రా చేయించాలన్న సంకల్పంతో నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో కొందరు స్వతంత్రులు భారీగానే ఓట్లను కొల్లగొట్టారు. వారివల్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటలములపై ప్రభావం చూపిందనే చర్చ సాగింది. స్వతంత్రులు పొందే గుర్తుల వల్ల కూడా ఎక్కడ తమకు పడాల్సిన ఓట్లు పోతాయోనన్న భయమూ ఆయా పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది. నామినేషన్ వేసిన వారిని విత్డ్రా చేయించి మచ్చిక చేసుకొని తమవెంట ప్రచారం చేయించాలన్న ఆలోచన కొందరు నాయకులు చేస్తున్నారు. కాగా ఈ యత్నాల్లో నాయకులు ఏమేరకు సఫలీకృతం కాగలరో వేచి చూడాల్సిందే.
బుజ్జగింపుల పర్వం షురూ
స్వతంత్రులు, చిన్న పార్టీల
అభ్యర్థుల నామినేషన్ల
ఉపసంహరణకు యత్నాలు
నేడు 3గంటల్లోపే గడువు
