మంచిర్యాలఅర్బన్: విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించి పరిజ్ఞానం, సృజనాత్మకత పెంపొంచడానికి ప్రవేశపెట్టిన పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు శని వారం మొక్కుబడి మారింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 483, ప్రాథమికోన్నత 97, ఉన్నత పా ఠశాలలు 132 ఉండగా.. 45,634 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని పాఠశాలలను ‘సాక్షి’ సందర్శించగా రోజూ మాదిరిగానే పాఠ్యపుస్తకాల బ్యాగులతో హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలల్లో నెలవా రీ కనీస అభ్యాస సామర్థ్యాల సాధనలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ పరీక్షలు నిర్వహించడంతో పుస్తకాలు తెచ్చుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ఎఫ్ఏ–2 పరీక్షలు పూర్తవడంతో సమీక్ష కోసం పుస్తకాలు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. పీటీఎం సమావేశాల వల్ల బిజీబిజీగా గడపడం వల్ల నో బ్యాగ్ నామమాత్రంగా మారింది.
ప్రత్యేకంగా కార్యాచరణ
రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యుల్ను ఉపాధ్యాయులు అమలు చేసేలా విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతీ నెల మూడో శనివారం ఒకటిన ఉంచి పదో తరగతి విద్యార్థుల వరకు పుస్తక రహిత అంశాల బోధన ఉంటుంది. విద్యార్థులు బ్యాగు లేకుండా హాజరైతే వృత్తివిద్య అనుభవ పూర్వకంగా అభ్యసనాలు చేయిస్తారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది. కళలు, పర్యావరణం, చేతిపనులు, సృజనాత్మక కార్యకలాపాలు, పాఠ్యపుస్తకాలు మించిన వాస్తవ అనుభవాల అంశాలకు ప్రాధాన్యత లభిస్తుంది. శనివారం మాత్రం జిల్లాలోని పదుల సంఖ్యలో పాఠశాలల్లో మాత్రమే పాటలు, క్విజ్ పోటీలు, గ్రామీణ ప్రాంతాల సందర్శన చేసినట్లు తెలుస్తోంది.


