మంచిర్యాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్, మధ్యా హ్న భోజనం అందించేందుకు హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్టు (ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేసి, నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల రమ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వొడ్డె రాజమౌళి, నాయకులు పూర్ణచంద్రరావు, రాజేశ్వర్రావు, సంజీవరావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


