మంచిర్యాలఅర్బన్: ‘భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు వర్తిస్తుంది.. సెలవుకు బదులుగా ఆగస్టు నెల రెండో శనివారం పాఠశాల పనిదినంగా నిర్వహించాలి.. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు ఎలాంటి మార్పులేకుండా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి..’అని గురువారం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇంచుమించుగా ఉదయం 9గంటల 8 నిమిషాలకు జిల్లా విద్యాశాఖ పంపిన సందేశం ఇది..
జరిగిందేమిటి?
వర్షాల నేపథ్యంలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో జారీచేసిన ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విద్యాశాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసినప్పటికీ నిబంధనలు బేఖాతారు చేస్తూ క్షేత్రస్థాయిలో బడులు నడిపారు. జిల్లాలో 704 పాఠశాలలుంటే కేవలం 40 లోపు పాఠశాలలు మాత్రమే సెలవులు పాటించగా మిగిలిన బడులు నడిపినట్లు తెలుస్తోంది. సెలవుపై సందేశం ఆలస్యంగా వచ్చిందన్న సాకుతో విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి మధ్యాహ్నం వరకు పాఠశాలలు నడిపారు. చివరకు సెలవు పాటించకుంటే చర్యలు తప్పవని అధికారుల సందేశాలతో దిగివచ్చి మధ్యాహ్నం తర్వాత కొన్ని మండలాల్లో సెలవులు ప్రకటించగా మరికొన్నింట్లో సాయంత్రం వరకు నడిపారంటే అధికారుల ఆదేశాలు ఏమేర పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
టీచర్లు, సంఘాల అభ్యంతరం..
ఉపాధ్యాయులు ఇప్పటికే పాఠశాలలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తి చేసినందువల్ల సెలవు అవసరం లేదని టీచర్లు అభిప్రాయపడ్డారు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో సెల్ సందేశం ఆలస్యంగా వచ్చేసరికి మెజారిటీ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తయింది. వర్షంలో వచ్చిన పిల్లలను వెంటనే వెనక్కి పంపించడం సురక్షితం కాదని పేర్కొన్నారు.
రెండో శనివారం బడి
నడపడమే కారణమా?
డీఈవో ఉత్తర్వుల ప్రకారం గురువారం ఇచ్చిన సెలవు భర్తీ చేసేందుకు ఆగస్టు నెల రెండో శనివారం పనిదినంగా ప్రకటించారు. ఆరోజు సెలవు కోల్పోవడం ఇష్టంలేని కొందరు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు డీఈవో ఆదేశాలను పట్టించుకోకుండా ఉదయమంతా బడి నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


