ఇంటర్‌లోనే ఉపాధికి బాట | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లోనే ఉపాధికి బాట

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

జూనియర్‌ కాలేజీల్లో ప్లేస్‌మెంట్‌ విభాగాలు అవగాహన కల్పించేందుకు కోఆర్డినేటర్‌ నియామకం నైపుణ్యాల పెంపు, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్‌ విద్యాశాఖ

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్లేస్‌మెంట్‌ విభాగాలు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలు ఉండగా వీటిలో సుమారు 13వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన కెరీర్‌ మార్గదర్శనం అందించేలా చర్యలు చేపట్టనున్నారు.

ఉపాధి అవకాశాలకు వారధిలా..

విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి, ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు దక్కేలా కళాశాలలో ఒక అధ్యాపకుడికి ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ అభిలాష అభినవ్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కోఆర్డినేటర్లు వారికి ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. కోఆర్డినేటర్లు తమ ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించడం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అందేలా చూడటం తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారు ఆయా కళాశాలల్లో విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్‌ రూపొందిస్తారు. విద్యార్థులకు కెరీర్‌ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించే బాధ్యత కూడా వారిదే.

ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై

అవగాహన

ప్లేస్‌మెంట్‌ విభాగాల ద్వారా ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ, పారామెడికల్‌, వ్యవసాయం, పాలిటెక్నిక్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర రంగాలపై నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఫార్మా వంటి కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, కెరీర్‌ గైడెన్స్‌, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఉమ్మడి జిల్లా వివరాలు..

ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధికంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం అందుబాటులో ఉండదు. ప్లేస్‌మెంట్‌ విభాగాలు ఏర్పాటు ద్వారా అలాంటి విద్యార్థులకు సరైన దిశానిర్దేశం లభించడంతో పాటు భవిష్యత్‌ కెరీర్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం కలగనుంది.

గ్రామీణ విద్యార్థులకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement