మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి డీజీపీ సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 24/7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. శిథిల భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. డీసీపీ ఎ.భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


