కౌటాల: జిల్లాతోపాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. తాటిపెల్లి వద్ద వార్దా, గుండాయిపేట గ్రామానికి సరిహద్దులోని పెన్గంగ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లను తాకుతోంది. వరద పెరగడంతో గంగపుత్రులు చేపల వేట నిలిపివేశారు. వార్దా, పెన్గంగ నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల సీఐ బి.సంతోష్కుమార్ సూచించారు.


