నార్నూర్: జలపాతాల వద్ద ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో మండలంలోని గుండాల గ్రామ శివారులోని కుండాయి జలపాతం వద్ద బుధవారం నార్నూర్ ఎస్సై శ్రీసాయి ఆధ్వర్యంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో పర్యాటకులు, యువత ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సూచిక ఏర్పాటు చేశారు. జలపాతాన్ని సందర్శించే వారు రాళ్లపైకి ఎక్కడం, లోతైన నీటిలోకి దిగడం, సెల్ఫీల కోసం అంచుల వరకు వెళ్లడం, మద్యం సేవించి జలపాతం పరిసరాల్లో సంచరించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్థానికులు కూడా సందర్శకులకు భద్రతా సూచనలు తెలియజేస్తూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


