
వరదనీటితో పంటలకు ముప్పు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 16.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు పంటలు సాగయ్యాయి. ఇందులో అధికశాతం రైతులు పత్తి సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి, వరి, సోయా, కంది పంటలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటితో పంటల్లో మట్టి, ఇసుక మేటలు వేసి తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీంతో చేనులోంచి నీటిని పంపించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు నీటి పదను ఎక్కువై మొక్కలు జాలువారి పోతున్నాయి. పంటకు వేరుకుళ్లు, ఎండు తెగులు, ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగుళ్లు సోకడంతో ఆకులు పసుపు వర్ణం, ఎర్రబారిపోవడంతో పంట దిగుబడి తగ్గే ప్రమా దం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల రైతులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండి సరైన యా జమా న్య పద్ధతులు పాటించాలని, పంటల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు.
పత్తి పంటలో..
Å పంట చేలల్లో కాల్వలు తీసి నీటిని బయటకు పంపించాలి. వీలైనంత త్వరగా అంతర కృషి చేయాలి. దీనివల్ల భూమిలో తేమ తగ్గి వేర్లకు గాలి, పోషకాలు అందడంతో మొక్కలు త్వరగా సాధారణ స్థితికి వస్తాయి. నీరు బయటకు పంపిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ను మొక్కకు 5 నుంచి 6 సెంటిమీటర్ల దూరంలో గుంతలు తీసి వేయాలి. లేదా అంతరకృషి చేయాలి.
Å పొలంలో తేమ అధికంగా ఉన్నప్పుడు వేర్లు పోషకాలు, నీటిని తీసుకోలేక ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కాబట్టి 20 గ్రాముల యూరియా లేదా పది గ్రాముల 20–20 లీటరు నీటిలో కలిపి ఐదురోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.
భూమి, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు పత్తిని ఆకుపచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు పది లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రైప్టోసైక్లిన్ను కలిపి పిచికారీ చేయాలి.
Å భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజమ్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొక్క మొదళ్లలో పోయాలి.
వరి పంటలో..
వరి సాగు చేసిన రైతులు ఇప్పటికే నాట్లు వేసినట్లయితే పంటలో ఎక్కువ మోతాదులో నీరు ఉండకుండా చూడాలి. ముంపు పాలైన వరి పొలాల్లో తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేయాలి.
.తాటాకు తెగులు
హిస్పాపిల్లా పెద్దపురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పొడతెగులు
ఆకులపై పాము పొడ మచ్చలుగా ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు లేదా వాలిడా మైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా వాలిడా మైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్+ టెబ్యుకొనజోల్ 75 డబ్ల్యూజీ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారీ చేయాలి.
అగ్గితెగులు
అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల లేదా ఐసోప్రోదయేలేన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకుముడుత పురుగు
ఈ పురుగు ఆకుముడుతలో ఉండి పత్రహరితాన్ని హరించడంతో ఆకులు తెల్లబడుతాయి. దీని నివారణకు పిలక దశలో చేనుకు అడ్డంగా తాడుతో 2 నుంచి 3 సార్లు లాగితే పురుగులు కిందపడిపోతాయి. ఆతర్వాత క్లోరిఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరాన్ నిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 20 డబ్లూడీజీ 0.25 గ్రాములు లేదా 48 ఎన్సీ 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున వేయాలి

వరదనీటితో పంటలకు ముప్పు