ఎర్రవల్లి: యువ ఆపద మిత్రులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో ప్రాణ రక్షణ చర్యలకు సహకరించాలని పదవ పటాలం ఇన్చార్జి కమాండెంట్ ఆదినారాయణ సూచించారు. బుధవారం బీచుపల్లి పదవ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్), తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా రెవెన్యూ అధికారి నిర్మలతో కలిసి హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని ఐదు జిల్లాల నుండి ఎన్ఎస్ఎస్ నుండి 43మంది, బిఎస్జి నుండి 17మంది, ఎన్వైకెఎస్ నుండి 31మంది చొప్పున ఎంపికై న మొత్తం 91మంది బాల బాలికలకు ఏడు రోజుల పాటు విద్యార్థులు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాదితులను సురక్షితంగా తరలించే విధానాల గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపు, సమీపంలో ఉన్న యువత తమకు అందుబాటులో ఉన్న వసరులతో బాధితులకు ప్రాథమికసాయం అందించడం, ప్రాణాలను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టేలా యువతను సిద్ధం చేయడమే యువ ఆపదమిత్ర కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారదిరెడ్డి, వెంకటరమణ, ఆర్ఐ శ్రీనివాస్, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


