జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం, సలహాలు ఉచితంగా అందిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి డి.ఇందిరా తెలిపారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆమె.. జైలులోని పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, కేసుల వివరాలు, న్యాయపరమైన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన ఆమె.. న్యాయ సహాయం అవసరమైన అర్హులకు ఉచిత న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన న్యాయపరమైన సందేహాలు, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఖైదీలకు తెలిపారు. అవసరమైన వారికి న్యాయ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జైలు సందర్శనలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్లో సీటు రాలేదని
విద్యార్థిని బలవన్మరణం
లింగాల: నర్సింగ్ ప్రవేశ పరీక్షలో సీటు రాలేదని మ నస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిని ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాలు.. లింగాలకు చెందిన ఉప్పల శంకరయ్య రెండో కుమార్తె భువనేశ్వరి (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసినట్లు తెలిపారు. కానీ సీటు రాకపోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు.
మట్టికుప్పల్లో కూరుకుపోయి వలస కార్మికుడి మృతి
హిందూపురం: మట్టికుప్పల్లో ఇరుక్కుపో యి వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని చెర్లోపల్లి వద్ద జరిగింది. వివరాలు.. చెర్లోపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్ద నూతన జాతీయ రహ దారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన అంజి (21) తన పెద్దమ్మ పెంటమ్మతో కలిసి ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చాడు. ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే సోమవారం రహ దారి పనుల నిమిత్తం కుప్ప చేసిన మట్టిని జేసీబీతో లెవెల్ చేస్తుండగా, అంజి మృతదేహం బయటపడింది. మట్టిని కుప్పులు పోస్తున్న సమయంలో అందులో ఇరుక్కుపోయి మృతి చెంది ఉంటాడని తోటి కూలీలు తెలిపారు. అంజి మృతదేహం అతని పెద్దమ్మ పెంటమ్మ, తోటి కార్మికులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు
కాల్వలో పడి దుర్మరణం
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... బీరోలు గ్రామానికి చెందిన నర్సింహులు (38) సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సమ యంలో ముఖం కడుక్కునేందుకు అక్కడే ఉన్న కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోగా తల భాగం సిమెంట్ దిమ్మెకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య పావని ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అప్పుల బాధతో
రైతు బలవన్మరణం
తెలకపల్లి: మండలంలోని గట్టురావిపాకులకు చెందిన రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు.. గట్టురావిపాకుల గ్రామానికి చెందిన సుబ్బయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పు చేసి తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేదని కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సుబయ్య ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భార్య ఉత్తరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.


