● సమాచారం అందిన వెంటనే తనిఖీలు చేపట్టాలి
● భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఇసుక అ క్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గురువారం తహసీల్దార్లతో నిర్వహించిన వెబెక్స్ సమీక్షలో ఇసుక అక్రమ తవ్వకాలు, భూభారతి, సదాబైనమా, మీసేవ, ప్రజాపాలన, కుటుంబ రిజిస్ట్రేషన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇసుకను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రికవరీ చేయాలన్నారు. మిడ్జిల్ మండలంలో సీజ్ చేసిన ఇసుకను వెంటనే వేలం వేయాలని మైనింగ్ అధికారులు, తహసీల్దార్ను ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మీడియాలో వార్తలు వచ్చినప్పుడు సంబంధిత తహసీల్దార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకున్న చర్యలను తెలియజే యాలని సూచించారు. అధికారులు బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టకుండా.. తమ పరిధిలోని అంశాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని స్పష్టం చేశారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నందున ప్రతి మండలం నుంచి 10 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను వెంటనే పంపాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న గృహాల ఎంపిక ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేసి అర్హుల జాబితాను హౌసింగ్ పీడీ కార్యాలయానికి పంపాలని సూచించారు. స్థానిక సమస్యలను ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పరిష్కరించి.. గృహాల కేటాయింపులో జా ప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తుల
పరిష్కారానికి ప్రాధాన్యం
భూభారతి పోర్టల్లో 60 రోజులకుపైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేయర్ల కొరత, కోర్టు కేసు లు, సాంకేతిక కారణాలతో నిలిచిన దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి సాధ్యమైన వాటిని పూర్తి చేయాలన్నారు. సాదాబైనమా, రీసర్వే, నక్షా సర్వే, మీసేవ, కుటుంబ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను కూడా సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల జారీ సమయంలో మరణించిన వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.


