● నేతన్నకు వెన్నెముకగా..
● మగ్గం పనిలో కొత్త పరికరం తయారు
● జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఐఐహెచ్టీ విద్యార్థి ఆవిష్కరణ
నేత పనిలో తన తల్లిదండ్రులు పడుతున్న కష్టం వగ్గు శ్రీరామ్ను నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది. మగ్గం కార్మికులకు వెన్నునొప్పి దూరం చేసేందుకు తయారు చేసిన పరికరం నేడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా 2,500 పైచిలుకు ఆవిష్కరణలు పోటీకి రాగా.. అమరచింత కుర్రాడు చేసిన యంత్రం మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వగ్గు శ్రీరామ్పై ప్రత్యేక కథనం..
అమరచింత: పట్టణానికి చెందిన వగ్గు శ్రీరామ్ పుట్టి పెరిగింది చేనేత కుటుంబంలోనే. తన చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మగ్గంపై కూర్చొని బాధలు ప డుతూ చీరలు తయారు చేస్తున్న పరిస్థితులను కళ్లారా చూశాడు. పదో తరగతి అనంతరం హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూ మ్ టెక్నాలజీలో డిప్లామా కోర్సులో చేరాడు. అక్క డే తన గైడ్తో పాటు సొంత తమ్ముడిలా ఆదరించిన పల్లె సృజన ఆర్గనైజర్ నూకల అఖిల ప్రోత్సాహంతో నేతన్నకు వెన్నులో నొప్పి కలగకుండా సులువుగా పని చేసుకునే విధంగా పరికరాన్ని రూపొందించాడు. వీటిని తన ఇనిస్టిట్యూట్ ద్వారా ఈ నెల 1న ఢిల్లీలో జరిగిన సెమినార్లో ప్రదర్శించాడు. అన్ని రాష్ట్రాల నుంచి 2,500 పైగా ఆవిష్కరణలు రాగా.. శ్రీరాం రూపొందించిన ఆవిష్కరణ అందరిని ఆకట్టుకుంది. ఎంపికై న 100 ఆవిష్కరణలో శ్రీరాం ఆవిష్కరణకు మొదటి బహుమతి లభించింది. దీంతో ఈ నెల 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. తమ ఇనిస్టిట్యూట్కు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి వగ్గు శ్రీరామ్ దేశస్థాయిలో ప్రతిభ చూపడంపై అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.
అమరచింత బిడ్డకు అరుదైన పురస్కారం..
వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన వగ్గు రవి, సంధ్య దంపతులకు వగ్గు శ్రీరామ్ రెండో కుమారుడు. పదో తరగతి వరకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న శ్రీరామ్ హ్యండ్లూమ్లో డిప్లామా కోర్సు చేయాడానికి హైదరాబాద్లోని ఇనిస్టిట్యూట్లో చేరాడు. చేనేత రంగంలో కార్మికులకు ఉపయోగపడే విధంగా ఒక కొత్త ఆవిష్కరణతో ముందుకు రావాలనే తపనతో ఉన్న శ్రీరామ్కు అఖిల గైడ్గా వ్యవహరిస్తూ ప్రోత్సహించడంతో అనుకున్నది సాధించగలిగాడు. దీంతో పుట్టిన అమరచింతకు జాతీయ స్థాయిలో పేరును తీసుకురాగలిగాడు.


