మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడా పోటీలను మహబూబ్నగర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర సాంకేతిక బృందం శనివారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంతోపాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానాలు, జిల్లా కేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించింది. ఖేలో ఇండియా కబడ్డీ పోటీలతో పాటు మరో మూడు క్రీడలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేయాలని ఈ మేరకు జిల్లా యువజన, క్రీడల అధికారికి సూచించినట్లు సమాచారం. డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాను ఖేలో ఇండియా జాతీయస్థాయి క్రీడల ఆతిథ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేపడుతామని తెలిపారు.


