జడ్చర్ల టౌన్: మ్యారేజ్ బ్యూరోల వద్దకు ఎంతో విశ్వాసంతో తమ పిల్లల వివాహాల కోసం వచ్చే తల్లిదండ్రుల విశ్వాసాలను వమ్ముచేయకుండా వారికి పూర్తిస్థాయిలో భరోసానిస్తూ మంచి సంబంధాలను వెతికి పెట్టాలని ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూర్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు భాను ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల కేంద్రంలో ఓ మ్యారేజ్ బ్యూరో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వివాహం అనేది ప్రతి యువతి, యువకుడి నిండు జీవితమని, తల్లిదండ్రులకు తమ బాధ్యత అని భావించి తమ పిల్లల జీవితాలు నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని, ఆ బాధ్యతను మన పై ఉంచుతారన్నారు. అందుకే సంబంధాల విషయంలో అన్ని విషయాలు తెలుసుకుని ఇరు వర్గాలకు సమాచారం చేరవేయాలని అప్పుడే మనం విజయవంతం అవుతామన్నారు. ఆ దిశగా నూతన జిల్లా కార్యవర్గం పాటుపడాలన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా కానుగు రామ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా పవన్కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవి, సంయుక్త కార్యదర్శిగా యాదయ్య, మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి, న్యాయ సలహాదారులుగా పెద్ది శ్రీనివాసులును నియమించారు. కార్యక్రమంలో బ్యూరో జాతీయ ప్రధాన కార్యదర్శి అనూష పాల్గొన్నారు.
అదుపుతప్పిన బైక్..
ఒకరికి గాయాలు
తిమ్మాజిపేట: బైక్ అదుపుతప్పి ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీను బిజినేపల్లి– జడ్చర్ల ప్రధాన రహదారిపై పాలమూరు– రంగారెడ్డి కాల్వ నూతనంగా నిర్మించిన బ్రిడ్జికి సమీపంలో బైక్పై జడ్చర్ల నుంచి వస్తుండగా రోడ్డుపై గుంతను తప్పించబోయి అదుపు తప్పి కిందపడ్డాడు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న వారు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


