కల్వకుర్తి రూరల్: మానవాళిని విపత్తుల నుంచి కా పాడేందుకు కల్వకుర్తిలో చేపట్టిన 91వ విశ్వశాంతి మహాయాగం ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతిపూజలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న యాగం గొప్పదన్నారు. వర్షాలు పెద్దఎత్తున కురిసి, మానవాళి సుభిక్షంగా ఉండేలా యాగఫలం ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సమాజ హి తం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలన్నారు. యాగానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో గణపతి పూజ
మొదటిరోజు గణపతి పూజ, హోమం, యాగ ప్రతిష్ఠ, గోపూజ మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులకు అల్పాహారం, భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుల తెలిపారు. వేద ఘోష కల్వకుర్తి ప్రజలకు వినపడేలా ముఖ్య కూడళ్లలో మైకులను ఏర్పాటు చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగేందుకు దాతలు ముందుకు వస్తున్నట్లు యాగ నిర్వాహకులు కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాకూర్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, మాజీ చైర్మన్లు ఎడమ రాధికాసత్యం, రాచోటి శ్రీశైలం, జూలూరు రమేష్బాబు, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


