కో–ఆప్షన్‌పై ఆశలు | - | Sakshi
Sakshi News home page

కో–ఆప్షన్‌పై ఆశలు

Dec 28 2025 8:42 AM | Updated on Dec 28 2025 8:42 AM

కో–ఆప్షన్‌పై ఆశలు

కో–ఆప్షన్‌పై ఆశలు

ఉమ్మడి జిల్లాలో 1678 జీపీలు..

పంచాయతీరాజ్‌ చట్టంతో కొత్త పదవులు పుట్టుకొచ్చాయి. ఉపసర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌పవర్‌ అధికారం ఇవ్వడంతో ఇప్పటికే పలువురు ఆ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మరికొందరు కో–ఆప్షన్‌ పదవిపై ఆశలు పెట్టుకొన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసిన కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టాక ఇప్పుడు అందరి దృష్టి ఈ పదవులపై పడింది. తమకు సంబంధించిన వారు వార్డు మెంబర్లుగా ఎన్నిక కాని చోట్ల సర్పంచ్‌లు కోఆప్షన్‌ సభ్యుల ఎంపికలో జాగ్రత్తగా తమ మద్దతుదారులను ఎన్నునేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. నూతన పంచాయతీరాజ్‌–2018 చట్టం ప్రకారం గ్రామపంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లతో పాటు ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. కోఆప్షన్‌ సభ్యులకు ఓటు హక్కు మినహా వార్డు మెంబర్లతో సమాన హోదా ఉండటంతో ఈ పదవులపై ఇప్పుడు గ్రామాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఒక్కో పంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులు నియమితులు కానున్నారు. అయితే సభ్యుల ఎంపికలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లే కీలకంగా వ్యవరించనున్నారు. ఇంకా అధికారికంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా.. త్వరలో ఉత్తర్వులు జారీ కానుండగా దీనిపై గ్రామాల్లో అప్పుడే కసరత్తు ప్రారంభించారు.

ప్రతి జీపీలో ముగ్గురికి అవకాశం

వాస్తవానికి ఎవరిని కో–ఆప్షన్‌ సభ్యులుగా నియ మించాలో చట్టంలో పేర్కొన్నారు. కోఆప్షన్‌ సభ్యుల కు ఓటు హక్కు తప్ప వార్డు సభ్యులకు ఉండే ఇతర అధికారాలు, హోదా కల్పించారు. గ్రామపంచాయతీ సమావేశాలకు కోఆప్షన్‌ సభ్యులకు కూడా అహ్వానించాల్సి ఉంటుంది. అయితే తీర్మానాల ఆమోదం, ఇతర అధికారాలకు వీరికి ఏమేరకు ప్రాధాన్యత ఉంటుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యులుగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల నియామకంలో మాత్రం ప్రభుత్వం విభిన్నమైన విధానాన్ని అనుసరించేలా చట్టంలో పెర్కొంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామపంచాయతీల్లో ముగ్గురిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమించనుండగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని తప్పకుండా నియమించాలి. అలాగే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన స్థల దాతకు సైతం కోఆప్షన్‌ సభ్యుడిగా అవకాశం కల్పించవచ్చు. లేదా గ్రామానికి సేవ చేసే ఎన్నారైని నియమించుకోవచ్చు. దీంతో జిల్లాలో 1,671 గ్రామపంచాయతీల్లో ముగ్గురు చొప్పున మొత్తం 5,013 మంది కోఆప్షన్‌ సభ్యుల నియామకాన్ని జిల్లాలో త్వరలోనే చేపట్టనున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌లే ఎక్కువగా ఉండటంతో కోఆప్షన్‌ పదవులు సైతం ఆ పార్టీ మద్దతుదారులకే దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకునేందుకు కొన్ని గ్రామాల్లో రిటైర్డు ఉద్యోగులు లేరు. ముఖ్యంగా కొత్త పంచాయతీలు, తండాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అలాగే గ్రామ సమాఖ్య అధ్యక్షులు సైతం కొన్ని గ్రామాలకు లేరు. పంచాయతీలకు స్థలాన్ని ఇచ్చేందుకు ఎంత మంది ముందుకు వస్తారో తెలియదు. అలాంటప్పుడు కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలు, కో–ఆప్షన్‌ సభ్యులు ఇలా..

జిల్లా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినవి కో–ఆప్షన్‌ సభ్యులు

మహబూబ్‌నగర్‌ 423 422 1,266

నాగర్‌కర్నూల్‌ 460 454 1,362

జోగుళాంబ గద్వాల 255 255 765

వనపర్తి 268 268 804

నారాయణపేట 272 272 816

ప్రతి పంచాయతీ పాలకవర్గంలో ముగ్గురు సభ్యులు

సభ్యుల ఎంపికలో సర్పంచులు,

ఎమ్మెల్యేలే కీలకం

గ్రామాల్లో అప్పుడే కసరత్తు షురూ..

పదవిపై ఆశావహుల కన్ను

ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామ పంచాయతీలు ఉండగా ఎన్నికల సంఘం ఈ నెల మొదటి వా రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని అమ్రాబాద్‌ మండలం కుమ్మరోనిపల్లి, ప్రశాంత్‌నగర్‌, లక్ష్మాపురం, వంగురోనొపల్లి, కల్మూలోనిపల్లి 5 పంచాయతీలతో గిరిజన అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహంచలేదు. అదేవిధంగా చారకొండ మండలం ఎర్రవరల్లి గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించడంతో ఎన్నికలు జరగలే దు. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాకు ఎన్నికలు జరగలేదు. 1,671 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వీటిల్లో కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు కొలువుదీరారు. ఇందులో కాంగ్రెస్‌ 964, బీఆర్‌ఎస్‌ 482, బీజేపీ 75, స్వతంత్రులు 149, సీపీఐ 1, చొప్పున అభ్యర్థులు పంచాయతీ పాలన చేపట్టారు. ఎన్నికల సందడి ముగిసిపోవడంతో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు కొత్త ఏడాది జనవరి చివరి మాసంలో శిక్షణ పొందనున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కోఆప్షన్‌ సభ్యులపై పడింది. ఈ పదవుల కోసం పోటీ అన్ని గ్రామాల్లో ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం కోఆప్షన్‌ సభ్యుడి కోసం ఆరాట పడుతున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు ప్రమా ణ స్వీకారం చేశారు. బాధ్యతలూ చేపట్టారు.. కోలాహలం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి కో ఆప్షన్‌ సభ్యులపై పడింది. వీరికి వార్డు మెంబర్లతో సమాన హోదా ఉండటంతో వీటిపై ఆశావహుల కన్ను పడింది. ఆయా పార్టీలు, సర్పంచ్‌ల మద్దతుదారులు.. వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఇలా ఎందరో వీటిపై ఆశలు పెట్టుకున్నారు.

– అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement