
నిబంధనలు బేఖాతరు!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడబడితే అక్కడ అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలాంటి అనుమతి లేకుండా వీటిని జడ్చర్ల–రాయచూర్ రహదారి (ఎన్హెచ్–167)కి ఇరువైపులా, అలాగే ముఖ్య కూడళ్లతో పాటు ఆయా వీధుల్లో కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం రాకపోగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం ఎన్హెచ్–167కు ఇరువైపుల ఉన్న బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ల ద్వారానే ఏటా ఫీజు వస్తోంది.
5 కి.మీ.ల మేర ఎన్హెచ్–167
జిల్లా కేంద్రంలోని మయూరి ఎకో పార్కు మొదలుకుని రాజీవ్గృహకల్ప వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర జడ్చర్ల – రాయచూర్ రహదారి (ఎన్హెచ్–167) విస్తరించి ఉంది. దీనికి ఇరువైపులా ముఖ్య మూడళ్లలో వందలాది ఫ్లెక్సీలు, బ్యానర్లను కర్రల సాయంతో ప్రైవేట్ వ్యక్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నగర పరిధిలోని 13 విలీన గ్రామాల్లోనూ ఇలాంటి ఎన్నో వెలుస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. ఇందులో సీజనల్కు సంబంధించి చాలా ఉన్నాయి. ముఖ్యంగా వివిధ వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులకు సంబంధించి తమ సంస్థల ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు ప్రచారం కోసం కార్యకర్తలు పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు గల్లీలలో రోడ్లకు ఇరువైపులా ఉన్న విద్యుత్, ఇతర స్తంభాలకు కొందరు వ్యక్తుల పుట్టిన, చనిపోయిన రోజుకు సంబంధించినవి సైతం వెలుస్తున్నాయి. ముఖ్య కూడళ్లలోనైతే వివిధ శుభకార్యాలతో పాటు పండుగలప్పుడు, కొత్త సంవత్సరం వేడుకలవి లెక్కలేనని దర్శనమిస్తున్నాయి. వీటికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. నిబంధనల ప్రకారం వీటిని ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. అప్పుడప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగిస్తున్నారే తప్పా సంబంధీకుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకపోవడం గమనార్హం.
నగరంలో ఎక్కడబడితే అక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు
మున్సిపల్ కార్పొరేషన్కు దక్కని ఫీజు
లెక్కలేనన్ని వెలుస్తున్నా పట్టించుకోని వైనం
కేవలం హోర్డింగ్ల నుంచే వస్తున్న ఆదాయం

నిబంధనలు బేఖాతరు!