హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో పాలమూరు సాహితీవేత్తలు
కేయూ క్యాంపస్: మహబూబ్నగర్పాలమూరు జిల్లాకు చెందిన 22 మంది తెలుగు సాహితీవేత్తలు గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. వరంగల్లోని ప్రముఖ సాహిత్యకారుల జన్మస్థలాలు, నివాసస్థలాల సందర్శనలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించినట్లు వారు తెలిపారు. సాహిత్యకారుల వెంట కళాశాల మాజీ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, సాహితీవేత్తలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ గొప్పతనాన్ని బన్న అయిలయ్య వారికి వివరించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి విద్యాకేంద్రమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. అంతకుముందు పాలమూరు సాహితీవేత్తలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్ తదితరులు ఉన్నారు.


