సాక్షి,యాదాద్రి: పార్లమెంట్‌ను.....

- - Sakshi

సాక్షి,యాదాద్రి: పార్లమెంట్‌ను ప్రతిపక్ష పార్టీలు స్తంభింపజేస్తాయి కానీ, అధికారంలో ఉన్న బీజేపీ అదానీ కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. అదానీ స్టాక్‌ కుంభకోణంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ పార్లమెంట్‌లో ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీరు ప్రజస్వామ్యానికి తీవ్ర నష్టం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయాన్ని రాఘవులు ప్రారంభించారు. ఆ తర్వాత జనచైతన్యయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో విపక్షాలు ఏకమై బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని లేకుంటే ప్రమాదంలో పడుతుందన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సీపీఎం ఖండించడంలో ప్రజాస్వామ్యానికి జీవం పోయాలనే ఉద్దేశమే తప్ప కాంగ్రెస్‌ ప్రత్యేక ప్రేమ ఏమీలేదని స్పష్టం చేశారు. దేశ రక్షణ, ప్రజల హక్కులు, ప్రజాసామ్యం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని రాఘవులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి అన్యాయం జరిగితే ప్రతిపక్షాలు ఐక్యం కావాలంటారని, ప్రతిపక్షాలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్‌కు ఐక్యత గుర్తుకురాదని చురకలంటించారు. తెలంగాణ, కేరళలో గవర్నర్‌లు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను తమ కుర్చీలో వేసుకుని కూర్చున్నారని ఆయన విమర్శించారు.

ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బీజేపీ

పార్లమెంట్‌ను స్తంభింపచేయడం దారుణం

తెలంగాణ, కేరళలో గవర్నర్లు చట్టాలను తమ కుర్చీలో వేసుకుని కూర్చున్నారు

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top