● డోర్నకల్ మున్సిపాలిటీకి ఆర్థిక ఇబ్బందులు
● మందకొడిగా పన్నుల వసూళ్లు
డోర్నకల్: అరకొర ఆదాయంతో డోర్నకల్ మున్సిపాలిటీకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 15వార్డులు, సుమారు 18 వేల జనాభాతో ఏర్పడిన డోర్నకల్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు పన్నులు మాత్రమే. ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, నోఆబ్జక్షన్ సర్టిఫికెట్లు, నిర్మాణ అనుమతులు, మున్సిపాలిటీ దుకాణాలు, స్థలాల అద్దెల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 3,512 ఇళ్లు ఉండగా.. ఇంటి నంబర్లు లేని ఇళ్లు మరో వెయ్యి వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుల రూపంలో రూ.1.66 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఈ ఆదాయాన్ని జనరల్ ఫండ్కు జమ చేసి వివిధ పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు, తాగునీటి సరఫరా నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, మున్సిపాలిటీ కార్యాలయ నిర్వహణతో పాటు ఇతర పనులకు జనరల్ ఫండ్ నుంచి డబ్బు కేటాయించాల్సి ఉంది.
మందకొడిగా పన్నుల వసూళ్లు..
సిబ్బంది కొరత, రాజకీయ కారణాలతో మూడేళ్లుగా ఇంటితో పాటు ఇతర పన్నులు సక్రమంగా వసూలు కావడం లేదు. 2024–25వ సంవత్సరం 70 శాతం, 2025–26లో 56 శాతం, ప్రస్తుతం 2026–27లో ఇప్పటి వరకు 23 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పన్నుల వసూళ్లకు ప్రధాన అడ్డంకి సిబ్బంది కాగా.. రాజకీయ నాయకులు సైతం పన్ను వసూళ్లకు అడ్డు పడుతున్నారు. తమ వారిని పన్ను చెల్లించాలని ఒత్తిడి తేవద్దంటూ సిబ్బందిని అడ్డుకోవడంతో చాలామంది సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించడం లేదు. పన్నుల వసూళ్లను వార్డు ఆఫీసర్లు పర్యవేక్షించాలి. అయితే 15 మందికి ఒక్కరే విధుల్లో ఉండగా.. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ముగ్గురు బిల్ కలెక్టర్లు మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నారు.
16వ ఆర్థిక సంఘం
నిధులు రాక..
పన్నుల వసూలు మందకొడిగా ఉండడంతో 16వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటి వరకు జమకాలేదు. నిబంధనల ప్రకారం ప్రతీ సంవత్సరం 80శాతానికి పైగా పన్నులు వసూలైతేనే ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. మందకొడిగా పన్నులు వసూలు కావడంతో 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. దీంతో డోర్నకల్ మున్సిపాలిటీ కోటి రూపాయలకు పైగా ఆర్థిక సంఘం నిధులు కోల్పోయినట్లయింది.
ఆ నిధులు ఖర్చెలా చేస్తారు..
రెండేళ్ల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రూ.1.31 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.73 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు రూ. 54 లక్షలు జెడ్పీ స్కూల్ రోడ్డులో నూతన రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి విద్యుత్ స్తంభాలను మార్చేందుకు కేటాయించాలని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సూచించగా.. కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్ర తిపాదనను వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున రూ.73 లక్షల నిధులను స్థానిక సమస్యల పరిష్కారం, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
2025 - 26
1,47,00,000
83,00,000
56%
2026 - 27
1,66,00,000
39,00,000
23%
(ఇప్పటి వరకు)
ఆదాయ మార్గాలు అన్వేషించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, పాలకవర్గం మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. పన్నుల వసూళ్ల కోసం సిబ్బందిని పెంచుతూ ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థాయ్బజార్ పన్ను కేటాయించి వీధివ్యాపారుల నుంచి థాయ్బజార్ పన్ను వసూలు చేస్తే రోజువారీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి పన్నులకు సంబంధించి ప్రస్తుతం పన్ను కేటాయించే విధానం అస్తవ్యస్తంగా ఉంది. తక్కువ స్థలాలు, చిన్న ఇళ్లు ఉన్నవారికి ఎక్కువ పన్ను, పెద్ద భవంతులు ఉన్న వారికి తక్కువ పన్ను కేటాయించారు. పన్ను కేటాయింపు విధానాన్ని పునఃసమీక్షించాలి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు వెయ్యి ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించలేదు. వీటికి ఇంటి నంబర్లు కేటాయించి పన్నులు వసూలు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.


