● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: బీఆర్ఎస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టుపై వృథాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఈరోజు వరకు నీళ్లు రాకపోవడం బాధాకరమన్నారు. నిర్మాణంలో నాసిరకమైన మెటీరియల్ వాడడం, ప్లానింగ్, డిజైనింగ్ సరిగా లేదని తెలిసి కూడా ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి, ఇంజనీరింగ్ టెక్నాలజీలను పక్కనపెట్టి, అన్నీతానే ఇంజనీర్లకు పెద్దగా వ్యవహరించి కట్టించారని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి నీటిని అందించాలని బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, నీళ్లు ఎత్తి పోస్తే ప్రాజెక్టు కూలిపోయి ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని, ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, 50 వేల మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు.


