డోర్నకల్: భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు అత్యవసర సమాచార సేకరణ కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని డీఏఓ విజయచంద్ర ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది భారీ వర్షాలతో డోర్నకల్, గొల్లచర్లకు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం ఆయా గ్రామాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి సంబంధిత శాఖల సిబ్బందితో పాటు స్థానికులను గ్రూపుల్లో చేర్చి అత్యవసర సమయాల్లో సమాచారం అందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు అన్ని శాఖల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, వ్యవసాయ అధికారి అనిల్కుమార్, సీడీపీఓ లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


