ఖిలా వరంగల్: వరంగల్ పాత లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ప్లాట్ల కేటాయింపులో జరిగిన ఆవకతవకలు, రిజిస్టర్ మాయం కావడానికి కారుకులైన ఐదుగురు సూపర్వైజర్లకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు గురువారం ఏనుమాముల వ్యవసాయ, కూరగాయాల మార్కెట్లను సందర్శించిన విషయం తెలిసిందే. కూరగాయాల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్దారులకు 2021–2022లో కేటాయించిన ప్లాట్లు, తదితర వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ మాయం కావడంపై లక్ష్మణుడు సీరియస్ అయ్యాడు. బాధ్యులైన సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి మల్లేశాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఐదుగురు సూపర్వైజర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఏడు రోజుల్లో సమగ్రమైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో తదుపరి చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
మార్కెట్ లైసెన్స్ జారీపై ఆరా?
వరంగల్ ఏనుమాముల మార్కెట్కు చెందిన గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ యజమాని లడే తిరుపతి సుమారు రూ.2.30కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి పరారీ విషయం విదితమే..వరంగల్ చాంబర్ ఆఫ్కామర్స్ ప్రతినిధులు వినతి పై లడే తిరుపతిపై జేడీఎం లక్ష్మణుడు ఆరా తీసినట్లు సమాచారం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మోసం చేసిన తీరు, గాయత్రి చిల్లీ ట్రేడర్పై పేరుతో లైసెన్స్ పొందిన తీరుపై అధికారులనుంచి నివేదికను కోరినట్లు తెలుస్తోంది. జమ్మికుంట మార్కెట్లో లైసెన్స్ జారీ చేసిన వ్యక్తి, వరంగల్ మార్కెట్లోలైసెన్స్ జారీ చేసిన కార్యదర్శి ఒక్కరే అనేది గుర్తించినట్లు తెలిసింది. లైసెన్స్ జారీ విధానంపై సమగ్ర నివేదికను అందజేయాలని ప్రస్తుత అధికారులను కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
● రిజిస్టర్ మాయంపై అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు సీరియస్


