వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ ఎదుట గల టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2011న, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు, ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్ దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 12వ తేదీతో ముగుస్తుందని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలకు ఉచిత విద్య, భోజన వసతులతో పాటు నైపుణ్యం గల శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థుల ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అ ర్హత గల విద్యార్థులు telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆలిండియా ఇంటర్వర్సిటీ పోటీలకు కేడీసీ విద్యార్థులు
విద్యారణ్యపురి: పంజాబ్లోని జలంధర్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే తైక్వాండో టోర్నమెంట్కు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు టి.నవీన్, వి.శ్రీయాంశ్, ఎ.మణికంఠలు ఎంపికయ్యారు. బుధవారం వీరిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ శశికాంత్ అభినందించారు.
బాలికపై సర్పంచ్ భర్త
అత్యాచార యత్నం
కన్నాయిగూడెం: భయం చెప్పమంటే బాలికపై ఓ సర్పంచ్ భర్త అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. కూతురు తన మాట వినడం లేదని, భయం చెప్పాలని పెద్దమనిషి, సర్పంచ్ భర్త శ్రీకాంత్కు వారం రోజుల క్రితం చెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న శ్రీకాంత్ మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లి ఆమైపె అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పంచాంగం ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవస్థాన శ్రీపరాభవ నామసంవత్సర నూతన పంచాంగాన్ని బుధవారం భద్రకాళి దేవాలయ కార్యాలయంలో ఈఓ రామల సునీత ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో జ్యోతిష్య పండితులు అయినవో లు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, పూర్ణచందర్, మోత్కూరి మయూరి, పార్నంది నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, పరిశీలకుడు క్రాంతికుమార్, ముఖ్యార్చకుడు చెప్పల నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు.


