హసన్పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న డిజిటల్ యుగంలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ‘నేషనల్ ఐపీ యాత్ర–2026’ కార్యక్రమం నిర్వహిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎన్ఐ–ఎంఎస్ఎంఈ), ఎస్సార్ యూనివర్సిటీల సంయుక్త ఆఽఽధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ఎన్ఐ–ఎంఎస్ఎంఈ ప్రతినిధి వి.స్వప్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్ఐ– ఎంఎస్ఎంఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. యూనివర్సిటీ ఆపరేషన్ డీన్ అర్చనారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఉన్న నవీనా ఆవిష్కరణలు, స్టార్టప్లకు అందిస్తున్న మద్దతు గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ బి. గిరిరాజన్, గురునాథం, రాజ్చందర్, చక్రధర్ ప్రవీణ్కుమార్, విద్యార్థి సమన్వయ కర్తలు రాజ్కుమార్, వేదశ్రీ పాల్గొన్నారు.
విద్యతోనే మహిళా సాధికారత
కేయూ క్యాంపస్ : విద్యతోనే మహిళా సాధికా రత సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ‘లిటరేచర్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ షేపింగ్ వికసిత్భారత్ –2047’ అనే అంశంపై నిర్వహించనున్న రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుటుంబ స్థాయి నుంచే మహిళ, పురుష సమానత్వం ప్రారంభం కావాలన్నారు. సమాజంలో మార్పులు వచ్చినప్పుడే సమస్యలు తగ్గుతాయన్నారు. మహిళలు శక్తివంతులని, వారికి సమాన హక్కులు కల్పించడం అవసరమన్నారు. పాఠశాల, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. వికసిత్భారత్సాధనలో మహిళల పాత్ర కీలకమన్నారు. అనంతరం హైదరాబాద్ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ విభాగం డీన్ కె. సునీతారాణి మాట్లాడుతూ మహిళల హక్కులను మానవ హక్కులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో వివక్ష, అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ దీపాజ్యోతి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, బి. రమ, సుకుమారి, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ టి. మనోహర్, అడ్మిషన్ల డైరెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
స్కూటీ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
తొర్రూరు: స్కూటీ ఢీకొని ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై జి. ఉపేందర్ కథనం ప్రకారం.. తొర్రూరుకు చెందిన ఎస్.కె యాకూబ్ పాషా(47) స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా, విధులు ముగించుకుని ఆర్టీసీ డిపో నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూరుకు చెందిన పొడిశెట్టి యాకయ్య స్కూటీపై వస్తూ యాకూబ్ పాషాను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో యాకూబ్పాషా రోడ్డుపై పడడంతో తీవ్రగాయమైంది. స్థానికులు గుర్తించి సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందాడు. మృతుడికి భార్య హసీనా, కుమార్తె ఫర్హానా, కుమారుడు కరీం పాషా ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్గా పురస్కారాలు పొందిన యాకూబ్పాషా మృతికి సిబ్బంది, స్థానికులు సంతాపం తెలిపారు.


