● ఆయుర్వేద ఆస్పత్రిలో సమస్యల తిష్ట
● సరిపోను స్టాఫ్ నర్సులు లేక సతమతం
● ల్యాబ్,ఈసీజీ, ఎక్స్రే టెక్నీషియన్లు కరువు
● క్షేత్రస్థాయి సిబ్బంది లేమితో
అరకొర సేవలు
కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆయుర్వేద(ఆయుష్) బోధన ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ స్టాఫ్నర్సుల కొరత వేధిస్తోంది. అలాగే, వివిధ విభాగాల టెక్నీషియన్లతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో రోగులకు అరకొర సేవలు అందుతున్నాయి. ఆయుర్వేద వైద్యంపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు మందులు అందుతున్నా వైద్య పరీక్షల్లో నిరాశ ఎదురవుతోంది.
ఆయుర్వేదంపై నమ్మకంతో చికిత్స కోసం ఇక్కడికి వచ్చే వారికి అవసరమైన వైద్యసేవలు అందుబా టులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వంద పడకల ఆస్పత్రి. అయినా పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని తెలుస్తోంది. ఈ ఆస్పత్రిలో 200 నుంచి 250 మంది అవుట్ పేషెంట్లు, 50 నుంచి 60 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు.
వంద పడకల ఆస్పతి సేవలకు అనుగుణంగా స్టాఫ్ నర్సుల నియామకం లేదు. ఇందులో దాదా పు 23 మంది స్టాఫ్ నర్సులు అవసరం ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే సేవలు అందిస్తున్నా రు. వీరిలో ఆరుగురు స్టాఫ్ నర్సులు ఫారెన్ సర్వీ సులోనే వైద్య సేవలు చేస్తున్నారు. అలాగే, పంచకర్మ డిపార్ట్మెంట్కు ఐదుగురు హెల్పర్లు సేవలు అందిస్తుండగా, మరో నలుగురు హెల్పర్లు అవసరం ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్య పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. ల్యాబ్, ఎక్స్రే, ఇసీజీ టెక్నీషియన్లు లేరు. పరికరాలు ఉన్నప్పటికీ సేవలు అందించేవారు కరువయ్యారు. అవసరాన్ని బట్టి వైద్యులే ఎక్స్రే సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఇక వైద్య పరీక్షలు ఇక్కడ లేకపోవడంతో నర్సంపేటలో ఉన్న టి. డయాగ్నోస్టిక్స్కు శ్యాంపిల్స్ పంపించి రిపోర్టు కోసం ఎదురుచూడక తప్పదు.
వంద పడకల ఆస్పత్రిలో సేవలు అందించడానికి క్షేత్ర స్థాయి కరవయ్యారు. ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒక స్వీపర్, మరో స్కావెంజర్తోనే పనులు చేయిస్తున్నారు. ఒకరు దోబీ ఉన్నప్పటికీ అతను రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం దోబీ పనులు చేయడానికి ఎవరూ లేనట్లు తెలుస్తోంది.
ఇంతపెద్ద ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డులు లేరు. ఒక వాచ్మెన్ తప్ప ఆస్పత్రి సంరక్షణ కోసం సెక్యూరిటీ కరువైంది. అసలే బస్స్టేషన్, రైల్వేస్టేషన్ ప్రాంతం, ఆపై కూరగాయల మార్కెట్ ఏరియా. చుట్టూ మారుమూల రోడ్డుమార్గం, ఖాళీ ప్రదేశం ఉండడంతో పేషెంట్ల భద్రత కరవైందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ఆయుర్వేద ఆస్పత్రిపై నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.


