పోటెత్తిన
గీసుకొండ : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు బుధవారం భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం కావడంతో కొమ్మాల స్టేజీ వద్ద మొహరించిన పలు పార్టీల ప్రభలు, వాటి వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తల నృత్యాలు, డప్పుచప్పుళ్లు జోష్ నింపాయి. చంద్ర గ్రహణంతో భక్తులు జాతరకు తొలి రాజు పెద్దగా తరలిరానప్పటికీ ప్రభల జోరు కొనసాగింది. ఇటు కొమ్మాల, అటు గిర్నిబావి నుంచి రాజకీయ ప్రభలతో పాటు సంప్రదాయ ప్రభలు జాతరకు పోటెత్తాయి. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభలు జాతరకు అధికంగా వచ్చాయి. డీజేలు, డప్పుచప్పుళ్లు, లంబాడీ మహిళల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కాంగ్రెస్ ప్రభ బండిని ప్రారంభించిన సందర్భంగా కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కటాక్షం అందరికీ ఉండాలని, జాతరను విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. కాగా, ఈ నెల 7న రాత్రి 10 గంటల తర్వాత స్వామి వారి రథోత్సవం వైభవంగా జరుగుతుందని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా జాతర సందర్భంగా ఆలయ డార్మెటరీని మూసివేయడంతో భక్తులు బస చేయడానికి ఇబ్బందులు పడ్డారు. అలాగే, స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన నల్లాల నుంచి నీరు రాకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
బీఆర్ఎస్ ప్రభ దగ్ధం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కొమ్మాల స్టేజీ నుంచి ప్రారంభించిన ప్రభ బండి జాతరకు చేరుకున్న త ర్వాత బుధవారం ఉదయం బాణా సంచా కాల్చగా నిప్పు రవ్వలు రేగి పాక్షికంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో నాయకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత జాతరలో కొమ్మాల స్టేజీ వద్ద ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ప్రభబండి బాణాసంచా నిప్పు రవ్వలకు దగ్ధమైన విషయం తెలిసిందే.
భక్తిశ్రద్ధలతో కొమ్మాల జాతర
నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీగా తరలిన ప్రభలు
ఈ నెల 7న స్వామి వారి రథోత్సవం


