వరంగల్ రీజియన్ను అగ్రస్థానంలో నిలపాలి
హన్మకొండ: రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ను అన్ని ఫార్మాట్లలో అగ్రభాగంలో నిలపాలని అధికారులు, ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ –1 డిపోలో వరంగల్ రీజియన్ స్థాయి ప్రగతిచక్రం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. కేఎంపీఎల్, ఆదాయం తీసుకురావడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులను ఆర్ఎం విజయ భాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేష్ ప్రదానం చేశారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ వరంగల్ రీజియన్ రూ.8 కోట్ల లాభాల్లో ఉందని పేర్కొన్నారు. డ్రైవర్లందరు 6 కేఎంపీఎల్ సాధించి ఇంధన పొదుపులో, జీరో ఆక్సిడెంట్లో వరంగల్ రీజియన్ను అగ్రస్థానం నిలపాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు చెందిన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం తీసుకొచ్చిన ఏడుగురు ఉద్యోగులు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి ప్రగతి చక్ర అవార్డులు అందించారు. రెండో త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం సాధించిన ఏడుగురు కండక్టర్లు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి, ఒక్క శ్రామిక్కు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్, హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రూ.8 కోట్ల లాభాల్లో ముందు వరుసలో
టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్
మేనేజర్ డి.విజయ భాను


