నేడే తొలి పోరు
146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్
మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈమేరకు బుధవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. గురువారం ఐదు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1,072 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. అందు కోసం పోలింగ్ కేంద్రాల్లో సామగ్రితో పాటు సిబ్బందికి విధులు కేటాయించారు.
మొదటి విడతలో ఐదు మండలాలు..
మొదటి విడతలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 155 గ్రామ పంచాయతీలు, 1,338 వార్డులు ఉన్నాయి. కాగా, గత నెల 27నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 3న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 9జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది, 1,072 వార్డుల్లో 2,391 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా మండలాల్లో 1,78,951 మంది ఓటర్లు ఉండగా.. 88,240 మంది పురుష ఓటర్లు, 90,701 మంది మహిళా ఓటర్లు, 10మంది ఇతరులు ఉన్నారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ..
మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మానుకోట మండలానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 12 కౌంటర్లు ఏర్పాటు చేసి పీఓలకు, ఓపీఓలకు సామగ్రితో పాటు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. పంపిణీని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీంచారు. ఇనుగుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో, నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల, గూడూరు, కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయాల్లో సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తంగా 1,753 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు.
ప్రతీ పోలింగ్ కేంద్రానికి పీఓ, ఓపీఓలు
200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్కు ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 201నుంచి 400మంది ఓటర్లు ఉంటే ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401నుంచి 650మంది ఓటర్లు ఉండే బూత్కు ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలను కేటాయించారు. వారితో పాటు 20 శాతం అదనపు సిబ్బందితో పాటు సామగ్రి కేటాయించారు. మొదటి విడతలో 1,621పీఓలు, 1,853 మంది ఓపీలను కేటాయించారు. వారితో పాటు సహాయంగా కేంద్రాల బయట కార్యదర్శులు, కారోబార్లు ఉంటారని తెలిపారు.
10 మంది మైక్రోఅబ్జర్వర్లు..
ఎన్నికల పోలింగ్ దృష్ట్యా 10మంది మైక్రో అబ్జర్వర్లు, వారితో పాటు ఆరుగురు రిజర్వు మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 122 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఐదు మండలాల్లో 49మంది రూట్ ఆఫీసర్లు, 15మంది జోనల్ అధికారులను కేటాయించారు.
ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహణ
ఐదు మండలాలకు సామగ్రి పంపిణీ పూర్తి
1,621మంది పీఓలు, 1,853మంది ఏపీఓలకు విధులు
10 మంది మైక్రో అబ్జర్వర్లు.. 1,753బ్యాలెట్ బాక్స్లు సిద్ధం
పంపిణీని పరిశీలించిన కలెక్టర్
ఉదయమే షురూ
గురువారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు.
వాహనాలను పంపిస్తున్న పోలీసులు
నేడే తొలి పోరు
నేడే తొలి పోరు
నేడే తొలి పోరు


