లెక్క తేలింది..
మహబూబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. ప్రక్రియ ఆలస్యం కావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 169 సర్పంచ్ స్థానాలకు గాను 19జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 150 సర్పంచ్ స్థానాలకు 516 మంది బరిలో ఉన్నారు. 1,412 వార్డులకు గాను రెండు వార్డుల్లో నామినేషన్ల సమస్యతో ఎన్నికలు వాయిదా పడగా.. 272 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మూడో విడతలో..
జిల్లాలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత జీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 169 జీపీలు, 1,412 వార్డులు ఉన్నాయి. ఈమేరకు ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తి చేశారు. కాగా ఈనెల 9న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది.
17న పోలింగ్..
మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్ ఈనెల 17వ తేదీన ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు, అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.
మూడో విడత జీపీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
19 జీపీలు, 272 వార్డులు ఏకగ్రీవం
150సర్పంచ్ స్థానాల్లో 516 మంది అభ్యర్థుల పోటీ
1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు
ఈనెల 17న పోలింగ్


