బాక్సుల్లో మందుల్లేవు!
తొర్రూరు: ప్రయాణికుల భద్రతే లక్ష్యం, వారి సంఖ్య పెంచడమే ధ్యేయమని చెప్పే ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో మందులు ఉండడం లేదు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ఏ బస్సులో మందులు కనిపించడం లేదు. మహబూబాబాద్, తొర్రూరు డిపోల్లో 175 బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో పేరుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నా వాటిలో మందులు పెట్టడం లేదు.
ఖాళీగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు..
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో బాక్సులను ఏర్పాటు చేసింది. ప్రమాద వేళల్లో వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నా అందులో మందులు కరువై ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రథమ చికిత్స అందడం లేదు. రవాణా శాఖ అధికారులు బస్సులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాత్రమే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అందులో మందులు ఉంటున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేసే బాక్సులు అలంకార ప్రాయంగా మారాయి.
కిట్లో ఇవి ఉండాలి..
రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేయాలి. కిట్లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే క్లాత్, గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్ ఉండాలి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్లోని మందులను మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్బాక్సులు ఏర్పాటు చేయడంతో పాటు మందులు ఉండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్సుల్లో క్షతగాత్రులకు అందని ప్రథమ చికిత్స
కొత్త బస్సులకే కిట్లు పరిమితం
మందులు లేకపోవడంతో తప్పని ఇబ్బందులు
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
బాక్సుల్లో మందుల్లేవు!


