
వానలోనూ రైతుల క్యూ..
మహబూబాబాద్ రూరల్/గూడూరు/ కేసముద్రం/నర్సింహులపేట: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కొద్ది రోజుల నుంచి యూరియా కొరత నెలకొనడం.. పంటల సాగు ముమ్మరం కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. అయితే సొసైటీలకు సరిపడా యూరియా రాకపోవడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. మరికొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా యూరియాకోసం రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చున్నారు. కాగా పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు తీసుకున్న రైతులకు అధికారులు యూరియా బస్తాలు అందజేశారు.
ఎక్కడెక్కడ అంటే..
● మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం బారులుదీరారు. గంటల తరబడి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. కాగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పీఏసీఎస్ వద్దకు వచ్చి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు దీపిక, శివ, అశోక్, తిరుపతి, రవికిరణ్, మౌనిక, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓలు సాయిప్రకాశ్, రంజిత్, బాలాజీ, సొసైటీ సీఈఓ ప్రమోద్ సుమారు 1,500 మంది రైతులకు టోకెన్లు ఇచ్చి 888 మంది రైతులకు యూరియా బస్తాలు అందజేశారు.
● గూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఉదయం నుంచే రెండువేల మంది రైతులు వర్షంలో గొడుగులు పట్టుకొని యారియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పీఏసీఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి.. యూరియా బస్తాల పంపిణీపై ఆరా తీశారు. ప్రస్తుతం ఎన్ని బస్తాలు వచ్చాయని పీఏసీఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని.. కృత్రిమ కొరత సృష్టించొద్దని సూచించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించే వారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. యూరియా వచ్చేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగభవాని, డీసీఓ ఎన్వీ రావు, మండల వ్యవసాయ అధికారి ఎండి.అబ్దుల్మాలిక్ పాల్గొన్నారు.
● కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంవిలేజ్ పీఏసీఎస్, కల్వల, పెనుగొండ, ఉప్పరపల్లిలో యారియా బస్తాల కోసం రైతులు బా రులుదీరారు. యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు, మహిళా రైతులు కొందరు చిన్నపిల్లలతో సెంటర్ల వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. అధిక సంఖ్యలో రైతులు రాగా, కొందరికే టోకెన్లు అందడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా అదనపు కలెక్టర్ అనిల్కుమార్ కల్వల, ఉప్పరపల్లి, కేసముద్రం పీఏసీఎస్ సెంటర్లను సందర్శించారు. యూరియా అందని రైతులు అధైర్యపడొద్దని, అందరికి సరిపడా యూరియా అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీ రా శ్రీనివాసరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు, కరుణాకర్, ఏఓ వెంకన్న, డీటీ ఎర్రయ్య పాల్గొన్నారు.
● నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి ఉదయం వందలాది మంది రైతులు యారియా కోసం వచ్చారు. అయితే యూరియా లేకపోవడంతో అంబేడ్కర్ సెంటర్లో మహబూబాబాద్కు వెళ్లే రోడ్డుపై సీపీఎం, సీసీఐ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈక్రమంలో ఏఓ వినయ్కుమార్ వచ్చి పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న యూరియాను రైతులకు తూతూ మంత్రంగా పంపిణీ చేశారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా
యూరియా కోసం పాట్లు
పీఏసీఎస్ కేంద్రాల వద్ద
పోలీసు బందోబస్తు

వానలోనూ రైతుల క్యూ..

వానలోనూ రైతుల క్యూ..