
రోల్మోడల్ ‘భూభారతి’ చట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : దేశానికి రోల్ మోడల్గా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూసమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఒక అద్భుతమైన అస్త్రం అవుతుందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ చదివి వినిపించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తమ భూ సమస్యలకు సంబంధించి ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా వాటికి భూభారతి చట్టం ద్వారా ఉన్న పరిష్కారం మార్గాలను ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్ జగత్ సింగ్ తెలియజేశారు. అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ సమస్య ఉన్న రైతు వద్దకే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లల్లో సన్న బియ్యం, ఉచిత విద్యుత్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. రైతుకు భూమికి విడదీయని బంధం ఉంటుందన్నారు. ఎంతోమంది మేధావులు, రైతులు, ఆయా వర్గాల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు చేసినదే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన భూ భారతి చట్టం గురించి అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో రైతులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్ మహిళా స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీ రూ. 2.50 లక్షల చెక్కును అందజేశారు. సదస్సులో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వొడితెల ప్రణవ్బాబు, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
జూన్ 2నుంచి అన్నీ గ్రామాల్లో సదస్సులు
ప్రజలు కార్యాలయాలకు వెళ్లనక్కర లేదు
దరఖాస్తు సహా అన్ని అధికారులు చేస్తారు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రోల్మోడల్ ‘భూభారతి’ చట్టం