11 నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15 వరకు 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖోపోటీలు జరగనున్నాయి. ఈమేరకు కాజీపేట రైల్వే స్టేడియంలో ఏర్పాట్లను ఆదివారం తెలంగాణ స్టేట్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించి మాట్లాడారు. ఖోఖో పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది వరకు క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ, రైల్వే స్టేడియం ఇన్చార్జ్ దేవులపల్లి రాఘవేందర్, నిర్వాహకులు పాల్గొన్నారు.
కేయూ క్రికెట్ విజేత వరంగల్
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్నా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్మన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్మన్ నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.రవికుమార్, డాక్టర్ బి.వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తుల విక్రయాలు
● మూడు దుకాణాల్లో
రూ. 15 లక్షలకు పైగా వస్త్రాల సీజ్
రామన్నపేట: నగరంలోని బట్టలబజారులో బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తులు విక్రయిస్తున్న మూడు షాపుల్లో ఢిల్లీ, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షలకు పైగా విలువైన నకిలీ వస్త్రాలను సీజ్ చేశారు. ఢిల్లీకి చెందిన లెగ్గిన్ తయారుచేసే ఓ ప్రముఖ కంపెనీ వస్త్రాలను ఆ కంపెనీకి చెందిన ఒక అక్షరాన్ని కాపీ చేసి నకిలీ వస్త్రాలను విక్రయిస్తుండడంతో కంపెనీ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్న షాపులపై దాడులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్లో కూడా ఇలాంటి విక్రయాలు జరుగుతున్న విషయం గుర్తించి పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సహకారంతో మట్టెవాడ పోలీసులతో కలిసి శనివారం రాత్రి బట్టలబజారులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజ్యలక్ష్మి, మహాభగవాన్, మంగళ్దీప్ ట్రేడర్స్ల్లో సుమారు రూ. 15 లక్షలకుపైగా విలువైన నకిలీ లెగ్గిన్ విక్రయాలు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతో వచ్చిన అడ్వకేట్ల బృంద సభ్యులు ఆ షాపుల్లో నకిలీ వస్త్రాలను సీజ్ చేయడంతోపాటు ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
11 నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు
11 నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు


