కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే సాగులో తగిన జాగ్రత్తలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త విజయ్ అవినాష్ లింగం సూచించారు. కర్నూలులోని ఉద్యాన భవన్లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచ విజయం దిశగా సాధికారత సాధించడం, ఎగుమతుల సన్నాహకాలపై సమగ్ర శిక్షణలో భాగంగా జిల్లాలోని ఎఫ్పీఓల ప్రతినిధులకు ఎగుమతులపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై అవగాహన కల్పించారు. ఏఏ పంటలకు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర తదితర వాటిని వివరించారు. కర్నూలు జిల్లా ఉద్యాన పంటల సాగుకు నిలయంగా మారుతోందని, ఎగుమతులకు అవకాశం ఉన్నప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ, నాబార్డు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బాగా పని చేస్తున్నాయని, ఎగుమతులకు అవకాశం కల్పించడం ద్వారా సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎగుమతులకు నాబార్డు, ఎపిడా సంపూర్ణంగా సహకరిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆప్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నబిరసుల్, నాబార్డు డీడీఏం సుబ్బారెడ్డి, ఎపిడా మేనేజర్ పెద్దస్వామి, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు.


