కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా డ్రాఫ్ట్ రోల్పై వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఈనెల 5, 6 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ల్లో బీఎల్ఓలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి ఫాం 6, 7, 8, 8ఏలను స్వీకరిస్తారని చెప్పారు. ఫాం–6 ద్వారా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫాం–7 ద్వారా ఓటరు తొలగింపునకు అర్జీలు ఇవ్వడం, ఫాం–8 ద్వారా పేర్లు, ఫొటోలు, ఇతర వివరాల సవరణ చేసుకోవచ్చన్నారు. ఫాం 8ఏ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
క్వింటా ఉల్లి రూ.4,340
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉల్లి సాగులో పురోగతి కరువైంది. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్కు 4,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్కు వచ్చింది. నేడు 1,182 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.2,569 లభించగా.. గరిష్ట ధర రూ.4,340, సగటు ధర రూ.4,190 నమోదైంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగకు గరిష్ట ధర రూ.9,419, ఆదోని మార్కెట్లో రూ.9,504, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.7,909 లభించింది.
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరంలో స్టేట్ కోటా కింద అడ్మిషన్లు పొందిన 34 మంది విద్యార్థులు మొదటి రోజు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ అడ్మిషన్లు ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తామని, సెలవు రోజుల్లో కూడా ఈ ప్రక్రియ నిరంతరాయంగా చేపడతామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ తెలిపారు. అడ్మిషన్ల కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, ఫార్మకాలజి హెచ్ఓడీ డాక్టర్ రాజేష్ పర్యవేక్షించారు.


