● లేకుంటే ఫారం–6తో నమోదు చేసుకోవచ్చు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్–2026 (ఎస్ఐఆర్)లో మీరు పేరు ఉందో? లేదో? చూసుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది. సర్–2026లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)లు ఇంటింటి సర్వే నిర్వహించి జిల్లాలో 18,14,128 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇందులో పురుషులు 8,93,162 మంది ఉండగా మహిళలు 9,19,105 మంది, ఇతరులు 264 మంది, సర్వీసు ఓటర్లు 1596 మంది ఉన్నారు. అంతేకాక 2,73,587 మంది ఓటర్లను తొలగించారు. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ రోల్ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సర్–2026, సర్–2002 జాబితాల్లో పేర్లు ఉన్నాయో లేవో సరి చూసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.
2002 సర్ జాబితాలో పేరు ఉందో, లేదో తెలుసుకోవడానికి voters.eci,ceoandhrapradesh పోర్టల్లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఇందుకు జిల్లా, పాత అసెంబ్లీ నియోజకవర్గం పేరు, పార్టు సీరియల్ నంబర్, రిలేటివ్ పేరు తదితర వివరాలు కావాల్సిఉండాలి. అలాగే 2026 సర్ జాబితాలో పేరు ఉందో, లేదో చూసుకోవడానికి voters.eci పోర్టల్కు వెళ్లాలి. ఇందుకోసం ఎపిక్ నంబర్ ఉండాలి.
ఫారం–6తో దరఖాస్తు చేసుకోవాలి
సర్–2026లో జాబితాలో అర్హులైన ఓటరు పేరు నమోదు కాకుంటే ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వీరంతా వెంటనే ఫారం–6 ఇచ్చి ఓటును పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే వారి ఓటు జాబితా నుంచి తొలగించబడుతుంది.
కొన్నవారైనా మేపుకుంటారని..!
ఆస్పరి: వర్షాభావంతో పశువులకు మేత కొరత ఏర్పడడంతో రైతులు తెగనమ్ముకుంటున్నారు. స్థోమత కలిగిన వారే పశువులను కొనుగోలు చేస్తారని, వారైనా సక్రమంగా మేపుకుంటారనే ఆలోచనతో ఆవేదన దిగమింగుకొని కుటుంబసభ్యుల్లాగా మెలిగిన ఎడ్లు, ఆవులు, గేదెలను అమ్ముకుంటున్నారు. ఆస్పరి, ఆలూరు, ఆదోని, దేవనకొండ మండలాల నుంచి సోమవారం పత్తికొండ సంత మార్కెట్కు ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలను తరలిస్తూ అమ్ముకుంటున్నారు. లక్ష రూపాయలు విలువ చేసే ఎద్దులను రూ.70 వేలకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు ప్రతి రైతు ఇంట్లో కాడెద్దులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న వారు కూడా కరువు పరిస్థితుల్లో వాటికి మేత కొనలేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి
కర్నూలు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామం కొత్తపేట వీధికి చెందిన దార్ల దాసమ్మ (71)ను ఆటో ఢీకొనడంతో మృతిచెందింది. ఈమెకు నలుగురు కూతుర్లు, కుమారుడు సంతానం. మూడో కూతురైన ఉజ్వల కర్నూలులోని బిర్లాగడ్డ వీధిలో నివాసముంటోంది. పది రోజుల క్రితం కూతురు వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం ఉదయం బిర్లాగడ్డ వీధిలోని రమేష్ కిరాణం షాపు ముందు కూతురు ఉజ్వల, మనవరాజు హెప్సీబాతో కలిసి రోడ్డుపై నిలబడి ఉండగా ఒక ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో దాసమ్మ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సల నిమిత్తం జొహరాపురం రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతురాలి కుమార్తె ఉజ్వల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమం
హాలహర్వి: కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులకు సకాలంలో సాగు, తాగునీరు అందించకపోతే అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో విస్తృత పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోయ మునిస్వామి పేర్కొన్నారు. ఎల్లెల్సీ ద్వారా గ్రామాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఓంకారేశ్వర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు.


