శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక విశేష పూజల్లో భాగంగా ఆదివారం యాగశాల ప్రవేశం చేసి, విశేషపూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. సహస్ర ఘట్టాభిషేక విశేష క్రతువులో భాగంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు స్రందాయబద్దంగా యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం శివసంకల్పం, గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ–కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండస్థాపన తదితర విశేషపూజలను నిర్వహించారు. సోమవారం ఉదయం 5గంటల నుంచి ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, రుద్రహోమం, చండీపారాయణ, నదీపూజ, పుణ్యనదీజలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన ఘట్టములతో ఆలయ ప్రదక్షిణ, మల్లికార్జున స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రధాన ఘట్టాభిషేకం, సహస్ర ఘట్టాభిషేకం జరిపిస్తారు.


