మహానంది: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని నంద్యాల జిల్లా ఏఎస్పీ ఆర్. సుస్మిత స్పష్టం చేశారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బుచ్చమ్మతోపు గ్రామంలో ఆదివారం కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సోదాలు నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. పిల్లలు బాగా చదివితే మంచి ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే 100, 112 నంబర్లకు సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే చేరుకుని తగిన న్యాయం చేస్తారని సూచించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గ్రామాల్లో నేరచరిత్ర కలిగిన వారిపై నిరంతర నిఘా ఉంచుతూ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


