● వైకుంఠం జ్యోతి మూర్ఖత్వాన్ని వీడాలి
● వీఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక
అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్
కర్నూలు (అర్బన్): ఆలూరు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని వీఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ హితువు పలికారు. మూర్ఖత్వాన్ని విడనాడి దళిత ఆడబిడ్డతో రాజకీయం చేయడం మానుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతికి సూచించారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభాష్ మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభాగా ఉన్న వాల్మీకులు తలుచుకుంటే జీవితంలో వైకుంఠం జ్యోతి ఎమ్మెల్యే కాలేరని అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిని రాజకీయంగా ఎదుర్కోలేక వైకుంఠం జ్యోతి తన రాజకీయ స్వార్థం కోసం అమాయకురాలైన ఒక దళిత ఆడబిడ్డతో నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. వైకుంఠం జ్యోతి ఒక మహిళ అయి ఉండి ఎమ్మెల్యే విరూపాక్షి ఒక దళిత మహిళ చీర చింపారని దిగజారి అబద్ధాలు చెప్పి దళిత ఆడబిడ్డను అవమానించారని సుభాష్ విమర్శించారు. ఈ సంఘటనపై ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి ఎమ్మెల్యే విరూపాక్షి, తదితరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు, ఇంకొందరిపై దాడి చేసి గాయపరచిన టీడీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో వాల్మీకులను సమీకరించి త్వరలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.


