కృష్ణగిరి: ఈ ఏడాది పత్తి రైతు ల పరిస్థితి దయనీయంగా మారింది. కోటి ఆశలతో సాగుచేసిన తెల్ల బంగారం నిరాశ నింపుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసి పంట సాగుచేస్తే.. చివరకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో సాగు చేసినప్పటి నుంచి వర్షం లేకపోవడంతో పంట ఎర్రగా మారి ఎండిపోతుంది. బోరు, బావుల కింద కూడా సాగు చేసిన పంట కూడా ఏపుగా వచ్చినా చివరకు ఎర్ర తెగులుతో రంగుమారుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వేరుశనగ పంటను తొలగించగా, మరో నాలుగైదు రోజుల్లో పత్తి పంటను కూడా తొలగించనున్నట్లు రైతులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి పంటను జీవాలతో మేపుతున్నారు. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకంటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


