కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఆర్.ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు టౌన్ డివిజన్ విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పరచుకొని విద్యుత్ బిల్లులను తగ్గించుకునే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు మంజూరైన ఆరు కొత్త సబ్ స్టేషన్లలో కర్నూలు టౌన్ డివిజన్కు మంజూరైన ఫిల్టర్ బెడ్స్, గణేష్ నగర్ ప్రాంతంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను కన్స్ట్రక్షన్ విభాగం గుత్తేదారులకు అప్పగించాలన్నారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్న రాఘవులు, కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, కన్స్ట్రక్షన్ ఈఈ భాస్కరరావు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు.


